జగన్ ను సోనియా కలుస్తారా?
కాంగ్రెసు పార్టీ ఏం చేయాలో, హైకమాండ్ ఏం చేయాలో తమకు తెలుసునని వీరప్ప మొయిలీ అన్నారు. ఎవరో చెప్పినట్లు నడుచుకోవడానికి తామిక్కడ లేమని ఆయన అన్నారు. ఒక రకంగా ఆయన కరుగ్గానే మాట్లాడారు. జగన్ కోసం రాయబారిగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వద్దకు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వెళ్లారు. అయితే తాను వరదలపై మాట్లాడడానికి మాత్రమే ప్రణబ్ ను కలిసినట్లు లగడపాటి చెప్పుకున్నారు. జగన్ భేటీ తర్వాత మొయిలీని పార్లమెంటు సభ్యులు జి.వివేకానంద, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలుసుకున్నారు. మూడు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత నెమ్మదిగా కూర్చుని ఆలోచిస్తామని మొయిలీ చెప్పినట్లు వారు మీడియాతో చెప్పారు.
ఈ స్థితిలో జగన్ కు సోనియా గాంధీ అపాయిట్ మెంటు దొరుకుతుందా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఎన్ని రోజులు జగన్ సోనియాతో భేటీకి నిరీక్షించాల్సి వస్తుందో కూడా తెలియదు. ఈ నెల 23వ తేదీ వరకు జగన్ ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిపై చర్యలు కూడా తీసుకుంటామని మొయిలీ చెప్పారు.