గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక 4న
గ్రేటర్ తొలి పాలక పక్ష సమావేశం ఎక్కడ నిర్వహించాలన్న దానిపై మొదట గందరగోళం నెలకుంది. పాత ఎంసీహెచ్ కౌన్సిల్ హాల్లోనే నిర్వహించాలని కొందరు ఉన్నతాధికారులు సూచించినప్పటికీ స్థలం సరిపోదన్న కారణంగా పలు ఇతర వేదికల కోసం గ్రేటర్ అధికారులు ప్రయత్నించారు. ఒక దశలో ఏదైనా ఫంక్షన్ హాల్ ను బుక్ చేద్దామనుకున్నారు. అయితే ప్రభుత్వం జూబ్లీహాల్ వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
పాత నగరంలో మజ్లీస్ పట్టునిలుపుకొని 43 స్థానాల్లో విజయం సాధిస్తే..52 స్థానాల్లో విజ యం సాధించిన అధికార పార్టీ గ్రేటర్ లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నువ్వా..నేనా అంటూ వార్డుల్లో ప్రతిఘటించి 43 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగురవేసింది. అయితే గ్రేటర్ మేయర్ పీఠం కోసం తెలుగుదేశం ప్రయత్నించడం లేదనే వార్తలు వస్తున్నాయి.
ప్రతిపక్షం హోదాలోనే గ్రేటర్లో కొనసాగాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇకపోతే కాంగ్రెస్ - మజ్లీస్ల మధ్య పొత్తు ఉంటుందని మేయర్ పీఠాన్ని ఈ రెండు పార్టీల్లో ఎదో ఒకటి సాధిస్తుందని అంటున్నారు. లేకపోతే చెరి రెండున్నరేళ్ళు మేయర్ పదవీకాలాన్ని పంచుకోవాలని ఈ రెండు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. వీరికి తోడుగా ఎక్స్అఫీషియో సభ్యులు ఎక్కువగా ఉండటం వీరికి కలిసొచ్చే అంశంగా పరిశీలకులు పే ర్కొంటున్నారు.