తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లే: కెసిఆర్
మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయే సమయంలో ఇదే సమస్య వచ్చిందని, గుజరాత్ రాష్ట్ర ఏర్పాటును తెలంగాణను వ్యతిరేకించినట్లుగానే మరాఠీలు వ్యతిరేకించారని, గుజరాత్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ మరాఠీ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లారని, 17 మంది న్యాయవాదులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ గుజరాత్ ఏర్పాటు ప్రక్రియను సమర్థించిందని ఆయన చెప్పారు. గుజరాత్ రాష్ట్రం ఏర్పడిందని, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజలను అమాయకులను చేసి నాయకులు స్వలాభం కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్, చిరంజీవి, చంద్రబాబు ఊసరవెల్లి సిగ్గుపడేంతగా రంగులు మార్చే నాయకులని ఆయన అన్నారు. వారికి తెలంగాణ రాష్టం ఏర్పడుతుందని తెలిసినా ప్రజలను మోసం చేయడానికి ఆంధ్ర ప్రాంతంలో వెనకబడిపోకూడదని తెలివిగా సమైక్యాంధ్ర నినాదం చేస్తున్నారని ఆయన అన్నారు. చిరంజీవి, చంద్రబాబు పచ్చి అవకాశవాదులని ఆయన అన్నారు.
చిరంజీవి రాజకీయాలకు కొత్తవాడని, ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమ, కోస్తా ప్రజలను సమైక్యాంధ్ర పేరుతో మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ ఉద్యమానికి ఒక ఉమ్మడి నినాదం, ఉమ్మడి నాయకుడు కరువైనట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ఉద్యమం సద్దుమణిగిందని, ఎక్కువ ఉద్యమం సమైక్యాంధ్ర వినిపిస్తోందని రోశయ్య పచ్చి అవకాశవాద ప్రకటన చేశారని ఆయన అన్నారు. తనను నిరాహార దీక్ష చేయకుండా అడ్డగించిన ప్రభుత్వం కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులను ఎందుకు చేయనిస్తున్నారని ఆయన అడిగారు. రోశయ్యను చూస్తే జాలి వేస్తోందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర నినాదంతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కృత్రిమమైందని ఆయన అన్నారు. ఈ కృత్రిమమైన ఉద్యమం గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరాలు వెళ్లుతున్నాయని ఆయన అన్నారు. నాలుగైదు రోజుల్లో తాను బయటకు వస్తానని ఆయన చెప్పారు. ఆంధ్రలో జరుగుతున్న పెట్టుబడిదారీ ఉద్యమమని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమ పక్షాన నిలబడిందని తెలంగాణలో సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. అర్థరాత్రి ప్రకటనే చేస్తే తప్పేముందని ఆయన అడిగారు. మెడ మీద తలకాయ ఉన్నవాడెవ్వడూ చిదంబరం ఎవ్వడని అడగరని ఆయన అన్నారు. సంబంధిత కేంద్ర మంత్రి ప్రకటన చేసిన తర్వాత, పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించిన తర్వాత తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనట్లేనని ఆయన చెప్పారు.