కోస్తా, సీమాంధ్రలలో ముమ్మరమైన దీక్షలు
సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురాలలోని దీక్షా శిబిరాలను ఆయన సందర్శిస్తారు. పిఠాపురం, రామచంద్రపురం, గొల్లప్రోలుల్లో అఖిలపక్ష నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 12వరోజుకు చేరగా, కాకినాడలో న్యాయవాదులు చేస్తున్న దీక్ష పదో రోజుకు చేరాయి.
పశ్చిమగొదావరి జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న ఆమరణ దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే మదాల రాజేష్ చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరింది. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నేడు బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. కృష్ణాజిల్లాలో విజయవాడ మాజీ మేయర్ పంచమర్తి అనురాధ చేపట్టిన ఆమరణ దీక్ష 11వ రోజుకు చేరగా, ఉపాధ్యాయులు, కార్మికులు, ఎన్ జీవోలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు పెన్డౌన్కు జేఏసీ పిలుపు నిచ్చింది. జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నాం 3గంటలకు బందర్రోడ్డుపై భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.