చిరంజీవి శ్రీకాకుళం షెడ్యూలు, పిఆర్పీ నేతలకు కాల్షీట్లు!
వరస పరాజయాలతో డీలాపడిన ప్రజారాజ్యం పార్టీకి జిల్లాలో నూత నోత్తేజం ఇవ్వడానికి ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలు ప్రజారాజ్యం పార్టీకి కొంతవరకూ ఊపిరిపోసాయి. అధికార కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు ఈ ఉద్యమాలపై పూటకోమాట చెబుతుంటే ప్రజారాజ్యం పార్టీ మాత్రం సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
చిరంజీవి తన ఎజెండాను మార్చుకొని సామాజిక తెలంగాణ నిర్ణయానికి తిలోదకాలివ్వడం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పీఆర్పీకి కొంత వరకూ కలిసొచ్చే అంశంగా మారింది. సమైక్యాంధ్ర భావో ద్వేగాలు పీఆర్పీకి జీవం పోసేలా ఉపయోగించుకోవాలని భావిస్తున్న నేతలు ఆ మేరకు వ్యూహారచన చేసి చిరంజీవిని శ్రీకాకుళం రప్పిస్తున్నారు. పార్టీ ప్రారంభించిన వెంటనే చిరంజీవి తన ప్రజా అంకిత యాత్రను శ్రీకాకుళం నుంచే ప్రారంభించారు. ఇక్కడ నుంచే రాష్ట్ర పర్యటన మొదలైంది. ఆ నాటి పర్యటనకు లభించిన విశేష స్పందన చూసి ఇతర పార్టీల్లోని కొంత మంది సీనియర్ నేతలు పీఆర్పీకి మారారు.