వేడెక్కిన ఢిల్లీ: ఎవరి వాదాలు వారివే
రాజకీయ నాయకులు ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు, దానికి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తుండగా రాష్ట్రాన్ని విభజించడం తగదని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. సమావేశం వివరాల కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కేంద్ర నిర్ణయం ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకుని ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు నార్త్ బ్లాక్ వద్ద నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్ గౌడ్ తెలంగాణ నినాదాలు చేశారు. ప్రాంతాలవారీగా తమ పార్టీ ప్రతినిధులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించడానికి కాంగ్రెసు పార్టీ నాయకత్వం అనుమతి ఇచ్చింది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఇద్దరు కూడా తమ వ్యతిరేక వాదనలను సమావేశంలో పెట్టనున్నారు. సిపిఎం సమస్యను త్వరిత గతిని పరిష్కరించాలని, నిర్దిష్టమైన ప్రకటన చేయాలని కోరే అవకాశం ఉంది. బిజెపి, సిపిఐ ప్రతినిధులు ఒకే మాటగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలపనున్నాయి. ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధులు సమైక్యవాదాన్ని వినిపించనున్నారు. మజ్లీస్ ప్రతినిధుల అంతరంగం బయటపడడం లేదు.