తెలంగాణ కాంగ్రెసుపై డెడ్ లైన్ కత్తి
తాము రాజీనామాలు చేయబోమని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఇది వరకే చెప్పారు. అయితే రాజీనామాలపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అందరూ రాజీనామాలు చేయాల్సిందేనని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేస్తున్నారు. కెసిఆర్ పర్యటనలు చేపట్టి రాజీనామాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధపడ్డారు. కాంగ్రెసు నాయకులు ఎవరు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. రాజీనామాల వ్యవహారంపై ఇప్పటికే వివాదంగా ఉంది. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులను ప్రజలు తిరగనీయడం లేదు.
ప్రజాప్రతినిధులపై రాజీనామాలు చేయాలనే ఒత్తిడి పెరగడంతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హస్తినకు వెళ్లి వచ్చారు. ఈ సమయంలో ప్రజాప్రతినిధులు రాజీనామాలపై మరింత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు తెలంగాణ జెఎసికి దూరమవుతుందనే మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమ నిర్వహణకు ఒక సారథ్య కమిటీని వేసుకుంది. ఈ సారథ్య కమిటీ ద్వారా విడిగా ఉద్యమం చేపట్టాలనే ఆలోచనలో కూడా కాంగ్రెసు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, తెలంగాణ కాంగ్రెసు నాయకుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం అన్నట్లుంది.