గౌడ జన బాంధవుడు పలగాని ప్రభాకర్
రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలనే ఉద్దేశంతోనే ప్రభాకర్ కు మొదటి భార్యకుమార్తె వెంకటేశ్వరమ్మతో వివాహం చేశారు. అయితే ఆమెకు వరుసగా ఆరుగురు పిల్లలు పుట్టి చనిపోవడంతో ప్రభాకర్ రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మొదటి భార్య వెంకటేశ్వమ్మకు ఓ కుమారుడు జన్మించాడు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తండ్రి ప్రారంభించిన వ్యాపారాన్ని ప్రభాకర్ కొనసాగించారు.
అంచలంచెలు గా ఎదిగి లిక్కర్ సిండికేట్ గా మారారు. సారాపై నిషేధం విధించిన తర్వాత మద్యం వ్యాపారానికి దిగారు. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో కూడా రాణించారు. గారాల పట్టీ నాగవైష్ణవి పుట్టుకతో అతని దశ తిరిగింది. అంతే పట్టిందల్లా బంగారమైంది. అయినా ఆయనలో గర్వం పెరగలేదు. ఎంతోమంది పేదలకు ఆర్థిక సహాయం చేసేవారు. బీసీ విద్యార్థులకు లక్షలాది రూపాయలు స్కాలర్ షిప్లందించేవారు. సర్దార్ గౌతు లచ్చన్నపేరిట కళా, విద్యాపీఠాలు ఏర్పాటు చేశారు.
ప్రభాకర్, ఆయన కుమార్తె నాగవైష్ణవి మరణ వార్తలు తెలియగానే గుంటూరు జిల్లా పెనుమాకతోపాటు, కొత్తూరు తాడేపల్లి నుంచి పెద్దసంఖ్యలో బంధువులు నగరానికి తరలివస్తున్నారు. రాష్ట్ర గౌడ సంఘ ప్రధాన కార్యదర్శి అయిన పలగాని సంఘ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. దీంతో పలు జిల్లాల నుంచి గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్రం తరపున రెవెన్యూమంత్రి డీ ప్రసాదరావు ప్రభాకర్ భౌతిక కాయాన్ని పరామర్శించి సంతాపం తెలియజేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, బీజేపీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, మంత్రులు కేపీ సారథి, మాజీ మంత్రులు కోటగిరి, మండలి, ఎంపీలు లగడపాటి, కొనకళ్లలు ప్రభాకర్ కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు.