వైష్ణవి కేసు: వెంకట్రావును పోలీసులు ఎందుకు దాచిపెట్టారు?
వాస్తవానికి అతను లేవలేని స్థితిలో ఉండడం, ఇంకా విచారణ జరపాల్సి ఉండడం వల్లే అరెస్టు చూపలేదని సమాచారం. కానీ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ లో ముగ్గురి పేర్లు ఉండడం, ఇద్దరిని అరెస్టు చేయడంతో అందులో మూడో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని టీవీ ఛానళ్లు విస్తృతంగా ప్రచారం చేశాయి. వాస్తవానికి అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు. తమ అదుపులోనే ఉన్నట్లు చెబితే అరెస్టు చూపించాల్సివుంటుంది కాబట్టి పోలీసులు ఆ పని చేయలేదు.
చిన్నారి వైష్ణవి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు అసలు విషయాలను బహిర్గతం చేయలేదు. నిందితులను మీడియాకు దొరక్కుండా అత్యంత నాటకీయంగా జైలుకు తరలించిన తర్వాత సీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడినా అదనంగా ఒక్క విషయాన్ని కూడా చెప్పలేదు. తీవ్ర ఉత్కంఠకు లోను చేసిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. మరోవైపు అరెస్టు చేసిన వారి ముఖాలు కెమేరాలకు దొరక్కుండా ఉండడం కోసం పకడ్బందీగా వ్యవహరించారు.