టిటిడి ఆడిటోరియంలో అసభ్య నృత్యాలు, ఈవో సీరియస్
తిరుపతిలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో టీటీడీ మహతిని ఉదారంగా కేటాయిస్తూ వస్తోంది. పేదలు, వికలాంగుల సహాయార్థం నిర్వహించే కార్యక్రమాలకు విద్యుత్ బిల్లు మాత్రమే వసూలు చేసేలా అనుమతిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు కొంత మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు ఈ సహాయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నాయి.
టీటీడీలో పనిచేస్తున్న జగ్గం రామమూర్తి చైర్మన్గా ఉన్న తిరుపతి కల్చరల్ అకాడమి సంస్థ అంధుల సహాయార్థం ఆదివారం మహతిలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి తీసుకున్నారు. టీటీడీ ఉదార స్వభావంతో కేవలం విద్యుత్ బిల్లు మాత్రమే వసూలు చేసుకునేలా అనుమతి ఇచ్చింది. అయితే ఈ సంస్థ నిర్వాహకులు రాత్రి 8-30 గంటల నుంచి 'రింగ రింగ రింగ రింగ' అనే పాటకు మహతిలో అభ్యంతర కరదుస్తులు ధరించి చేసిన నృత్యాలు యువతకు వెర్రెక్కించాయి. మంచి కార్యక్రమం అనుకుని వచ్చిన మహిళలు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. మహతి ప్రాంగణంలో మద్యం సీసాలు ఉంచుకుని వాటర్ బాటిళ్లలో కలిపి సేవించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటికి బలం చేకూర్చుతూ గ్రీన్ రూంలో మద్యం సీసాలు దొరికాయి.
ఈ విషయం ఈవో కృష్ణారావు దృష్టికి రావడంతో ప్రదర్శనను అర్ధాంతరంగా రద్దు చేయించారు. ఈ సంఘటనకు కారణమైన తిరుపతి కల్చరల్ అకాడమికి భవిష్యత్లో ఎలాంటి కార్యక్రమాలకు మహతిని ఇవ్వకుండా బహిష్కరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుండా ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.18 వేల కాషన్ డిపాజిట్ను లక్ష రూపాయలకు పెంచారు. మహతి నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల డిపాజిట్ టీటీడీ ఖాతాలో జమయ్యేలా ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతి కల్చరల్ అకాడమి కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న టీటీడీ ఉద్యోగులను షోకాజ్ నోటీసులు జారీచేసి వివరణ కోరారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి వారి మీద చర్యలు తీసుకోవాలని ఈవో నిర్ణయించారు.