బడ్జెట్ లో బెజవాడ డివిజన్ కు ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం, విజయవాడ-భీమవరం-నర్సాపూర్-నిడదవోలు డబ్లింగ్ పనులకు మమత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో చిరకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు కదలిక వచ్చే అవకాశం కనబడుతోంది. పది ప్రాజెక్టులు కేటాయించినట్లుగా ప్రకటించినా, ప్రణాళిక సంఘం అనుమతితో అనే మెలిక పెట్టారు. ప్రణాళిక సంఘం ఎంతవరకు అనుమతిస్తుందో, మన పార్లమెంట్సభ్యులు ఈ దిశగా ఎంతవరకు ప్రయత్నిస్తారో వేచి చూడాల్సిందే. మరోవైపు విజయవాడకు అంతర్జాతీయ స్టేషన్ హోదా ఈ ఏడాదీ దక్కలేదు.
విజయవాడ-గుంటూరు-చెన్నైకు కొత్త పాసింజర్ రైలు మంజూరు అయ్యింది. కాకినాడ-మన్మాడ్ ఎక్స్ప్రెస్ను షిర్డీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్-తిరుపతి, నిజాముద్దీన్-విశాఖపట్నం మధ్య కొత్త రైళ్లను మంజూరు చేస్తున్నట్లు మమత ప్రకటించారు. ఒకే బడ్జెట్లో ఇన్ని రైళ్లు రావడం ఇదే మొదటిసారి. కొత్తగా కొవ్వూరు-భద్రాచలం, నడికుడి-శ్రీకాళహస్తి, కొండపల్లి-కొత్తగూడెం, కోటిపల్లి-నర్సాపూర్ లైన్లు మంజూరు కాగా, జగ్గయ్యపేట-మిర్యాలగూడ లైన్ల సర్వేకు మమత అంగీకారం తెలిపింది.