కరుణానిధికి త్వరలో సోనియా దర్శనం
స్పెక్ట్రమ్ వివాదంలో రాజా రాజీనామా చెయ్యాలంటున్న ప్రతిపక్షం డిమాండ్లపై వ్యాఖ్యానించాలని అడిగినప్పుడు "మీ అందరికీ ఏదో శుభవార్త చెప్పడానికి నేనిక్కడికి రాలేదు" అని ఆయన తమిళభాషలో వ్యంగ్యంగా అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలతో ఆయన చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వస్తుందా అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు.
జూన్ నెలలో కోయంబత్తూరులో జరుగబోయే 9వ ప్రపంచ తమిళ సదస్సు ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఆహ్వానించేందుకుగాను దేశాధ్యక్షురాలు ప్రతిభా పాటిల్ ను కలుసుకున్న తర్వాత ఇక్కడున్న తమిళనాడు హౌస్ లో కరుణానిధి విలేఖర్లతో మాట్లాడారు. మన్మోహన్, సోనియాలను ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఈ ముఖ్యమంత్రి కలుసుకుంటారు.
స్పెక్ట్రమ్ కేసులో మంత్రి రాజాకు వ్యతిరేకంగా సిబిఐ వద్ద సాక్ష్యం ఉన్నట్లుగా ఒక వార్తాపత్రికలో వచ్చిన వార్తాకథనంపై మొత్తం విపక్షాలన్నీ పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపజేసిన కొన్ని రోజుల అనంతరం రాజాపై ఆయన వ్యాఖ్యలు వచ్చాయి.
ఆయన కుమారుడు, కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి ఎం కె అళగిరి వరుసగా పార్లమెంట్కు గైర్హాజరవడంపై వ్యాఖ్యానించాలని అడిగినప్పుడు 'మీరు ఆయన్నే అడగండి' అని కరుణానిధి ముక్తసరిగా బదులిచ్చారు. డిఎంకె అధినేతగా ఈ అంశంపై వ్యాఖ్యానించాలని ఒత్తిడి చేసినప్పుడు "ముందు ఆయన అభిప్రాయమేంటో చెప్పనివ్వండి. తర్వాత నేను చెబుతాను" అన్నారు.