హైకమాండ్ మాట విన్నట్లే విని చెలరేగనున్న జగన్?
అధిష్టానం చెప్పినందున తాత్కాలికంగా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఆగాలనే వాదనతో ఆయన ముందుకు సాగుతారని అంటున్నారు. అందుకు గాను ఆయన మరో వారం, పది రోజులు తీసుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని, తన తండ్రికి సంబంధించిందని, ఒక కొడుకుగా తన తండ్రికి ఇచ్చే నివాళిని వద్దడనం ఎంత వరకు సమంజసమని అంటూ ఆయన తన వాదనను ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంది. తద్వారా ప్రజల నుంచి తన పట్ల సానుభూతి పెరుగుతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఈసారి తాను ఒక్కడే కాకుండా తల్లి విజయలక్ష్మితో కలిసి ఓదార్పు యాత్రకు బయలుదేరుతారని అంటున్నారు. దానివల్ల యాత్రను ఆపడం ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురు కావడమే కాకుండా ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఓదార్పు యాత్రను అపి తల్లితో కలిసి పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలిసేందుకు జగన్ ప్రయత్నించవచ్చు. అప్పుడు కూడా సోనియాను కలిసి, అనుమతి పొందే అవకాశం లేకపోతే తన వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.