వైయస్ జగన్ కు పొమ్మనలేక పొగపెడుతున్న హైకమాండ్
జగన్ వ్యవహారాలను పట్టించుకోనట్లు వ్యవహరించడమే ప్రస్తుతం హైకమాండ్ అనుసరిస్తున్న వ్యూహంగా చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పై పార్టీ నాయకులు మనోగతాన్ని ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా జగన్ వ్యవహారశైలిపై వ్యతిరేకతను సామూహికంగా వ్యక్తం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. జగన్ వ్యవహారంపై మొయిలీ ఇప్పటికే ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావులతో ఫోనులో మాట్లాడారు. కాగా, ప్రధాని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రోశయ్య ఢిల్లీ వస్తున్నారు. ఈ సమయంలో జగన్ వ్యవహారంపై అధిష్టానానికి చెందిన నాయకులు ఆయనతో మాట్లాడే అవకాశాలున్నాయి.
వైయస్ వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ పార్టీ పెడతారనే ప్రచారం కూడా సాగుతోంది. అంత దాకా వేచి చూస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కాంగ్రెసు అధిష్టానం చూస్తోంది. ఈలోగా జగన్ వెంట వెళ్లేవారి గురించి ఆరాలు తీస్తోంది. అవసరమైతే జగన్ అనుచరులతో మాట్లాడి వారు వెళ్లకుండా చూసే ఎత్తుగడను కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జగన్ ను ఏకాకిని చేయడమే ప్రస్తుతం పార్టీ అధిష్టానం కర్తవ్యంగా తోస్తోంది.