చితక బాది విమానమెక్కించి బాబు బృందాన్ని పంపించేశారు
మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై తమ పోరాటాన్ని ఆపేదిలేదని అంతకు ముందు చంద్రబాబు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ధర్నా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 26న ప్రధాని వద్దకు అఖిలపక్షంలో భాగంగా వెళ్లేంతవరకూ పలు రూపాల్లో ఆందోళనలు కొనసాగించాలని టిడిపి నిర్ణయించింది. ధర్మాబాద్ నుంచి తెలుగుదేశం నాయకులను ఏ జైలుకు తరలిస్తున్నారనే అనుమానాల మధ్య మహారాష్ట్ర పోలీసులు తెలుగుదేశం నాయకులు ఔరంగాబాద్ విమానాశ్రయానికి తరలించారు. బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించి పంపారు. మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెదేపా బృందంపై కేసుల్ని ఉపసంహరించింది. కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ధర్మాబాద్ కోర్టులో పోలీసులు అఫిడవిట్ దాఖలుచేశారు. ఇక వీరందరినీ తరలించడానికి పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు.
చంద్రబాబు సహా ఆ బృందం విమానాశ్రయం రన్ వే ప్రాంతంలో ధర్నాకు దిగారు. పోలీసులు బలవంతంగా నేతలను లేపడానికి ప్రయత్నించినా అలాగే కూర్చుండిపోయారు. చివరకు చంద్రబాబును ఓ విమానంలో కూర్చోబెట్టి, మిగతా వారందరినీ మరో విమానంలో ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబును మరో ప్రాంతానికి తరలిస్తారనే ఆందోళనతో తమందరినీ చంద్రబాబుతో సహా తీసుకెళ్లాలని, లేకపోతే వెళ్లే ప్రసక్తిలేదని మిగతా నేతలు భీష్మించి కూర్చున్నారు. చంద్రబాబును ఒక విమానంలో, మిగతా వారందరినీ మరో విమానంలో తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న విమానయాన శాఖ అధికారులను పోలీసులు సంప్రదించి ఎట్టకేలకు అందరినీ ఒకే విమానంలో కూర్చోబెట్టించారు. అందులో కూర్చున్న వారంతా తమను బాబ్లీ సందర్శనానికి తీసుకెళ్లాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసినా పోలీసులు స్పందించలేదు. ఎట్టకేలకు విమానాశ్రయ రక్షణ సిబ్బందితో పాటు పోలీసులు విమానం తలుపులు మూసివేయించి టేక్ ఆఫ్ కోసం అధికారులను ఆదేశించారు. చివరికి నేతలంతా విమానంలోనే కూర్చుండిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో విమానం హైదరాబాద్కు బయలుదేరింది.