బాబ్లీపై పోరు చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారమే?
ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేని స్థితిలో రాష్ట్ర నాయకత్వం ఉంది. చంద్రబాబు గానీ ఇతర నాయకులు గానీ తెలంగాణలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేసే స్థితిలో లేరు. దీంతో చంద్రబాబు పరోక్ష పద్ధతిని ఎంచుకున్నారు. మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారి అవుతందనే నినాదంతో, కాంగ్రెసు పార్టీపై ప్రధాన ఆరోపణ చేస్తూ చంద్రబాబు బాబ్లీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై కూడా నీలినీడలు అలుముకునేలా ఈ పథక రచన సాగింది.
తెలంగాణ ఉప ఎన్నికల ప్రచారం ఈ నెల 25వ తేదీతో ముగుస్తుంది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ బాబ్లీపోరులో భాగంగా మహారాష్ట్రలోనే హల్ చల్ చేయాలని, తామే పత్రికల పతాక శీర్షికల్లో, చానెళ్ల ప్రధాన వార్తల్లో చోటు చేసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే, ముందుగానే చెప్పాపెట్టకుండా ఔరంగాబాద్ నుంచి తెలుగుదేశం నాయకులను మహారాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో దించేసింది. దీంతో తెలుగుదేశం నాయకులు 21వ తేదీన అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగి, ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ నెల 25వ తేదీన హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 25వ తేదీ వరకు బహిరంగ సభ ఏర్పాట్లలో తెలుగుదేశం నాయకులు మునిగిపోతారు. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.