ఆగేది లేదు: వేరు కుంపటికి వైయస్ జగన్ రెడీ

పార్టీ అధిష్టానం వైఖరి కూడా జగన్ ను వేరు కుంపటికి పురికొల్పుతోంది. అంబటి రాంబాబుపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బయ్యారం గనుల వ్యవహారంపై కూడా ఆయన ఇప్పటికి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలోనే ఆయన తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో తన ఓదార్పు యాత్రను ఆయన ఈ నెల 29వ తేదీ వరకు పొడగించారు. పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉండడానికే ఆయన తన యాత్రను పొడగించుకున్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉండడమే ప్రధాన లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారు.
జగన్ కొత్త పార్టీ పెట్టే విషయంపై రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర రావు, ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యయనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీతో సంబంధం లేకుండా వైయస్ రాజశేఖర రెడ్డి దాదాపు 50 మందికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. వారంతా ఇప్పుడు జగన్ తో ఉంటారని భావిస్తున్నారు. దీంతో పార్టీని చీల్చి, వేరు కుంపటి పెట్టడమా, సిఎల్పీ నాయకత్వాన్ని సొంతం చేసుకోవడమా అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యంతర ఎన్నికలను ఆహ్వానించాలా, వద్దా అనే దిశగా కూడా ఆలోచన సాగుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications