శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు భారీ వర్షాలతో వరదల ముప్పు
భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా తల్లడిల్లుతోంది. జిల్లాలోని నదులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతితో వంశధార ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గొట్టా బ్యారేజీ 22 గేట్లు ఎత్తివేశారు. బ్యారేజీ ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 65 వేల క్యూసెక్కులుగా ఉంది. వంశధార ఉద్ధృతికి కొత్తూరు మండలంలోని పెనుగోటివాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. బూర్జు మండలం నీలకంఠాపురం, నామలక్ష్మీపురం మధ్య ఓనిగెడ్డకు గండి పడడంతో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. భామిని మండలం దిమ్మిడిజోల వద్ద వర్షాలకు భారీ వృక్షం నేలకూలింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తూరు మండలం మాతల వద్ద రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
వాయవ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా వాయవ్య దిశగా కదలికలు సాగిస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో కూడా (గురువారం రాత్రి 8.30గంటల వరకు) ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణకోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అంచనావేస్తోంది. ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడనం మరింత బలోపేతమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ దిశలో 40నుంచి 50కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.