హైకమాండ్ ను వైయస్ జగన్ ఢీకొట్టేందుకు రెడీ
సురేఖ తర్వాత వరుసగా తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో ఒక్కొక్కరితో విమర్శనాస్త్రాలు సంధింపజేస్తూ అధిష్టానంపై తప్పు ఉంచుతూ ముందుకు సాగాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే అంబటి రాంబాబు, సురేఖ వ్యూహాత్మకంగానే ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. తమ వాళ్లను పార్టీ అన్యాయం చేస్తోందని ఆరోపించిన జగన్ తనకూ పార్టీ అన్యాయం చేసిందని జనంలోకెళ్లి చెప్పుకోవాలనేది ఎత్తుగడ. ముఖ్యమంత్రి వైఖరిని, ప్రభుత్వ తీరును, పాలన వ్యవహారాలను, జగన్ వర్గాన్ని అణచి వేస్తున్న పద్ధతిని తప్పుపడుతూ లేఖలు రాయించే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. తమ వర్గానికి చెందినవారికి అధిష్టానం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సొంత కుంపటి పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీ లోగా రాజకీయ సంక్షోభాన్ని సాధ్యమైనంత తీవ్ర స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పెట్టబోరనీ, పార్టీలో ఉంటూనే పోరాటం సాగిస్తారని కొండా సురేఖ అన్నారు. ఆయన సన్నిహిత వర్గాలు కూడా అదే మాట అంటున్నాయి. అయితే జగన్ ఆలోచన అందుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాకినాడలో జగన్ను కలిసిన ఎమ్మెల్యేలు కూడా కొత్త పార్టీ పెట్టడం, ప్రభుత్వాన్ని పడేయడం వంటి వాటిపట్ల విముఖత చూపినట్లు సమాచారం. ఆ సమయంలో జగన్ 'నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను' అని ఎమ్మెల్యేలతో అన్నట్లు తెలిసింది. అయితే తనకు జనబలం ఉందని, ఎవరొచ్చినా రాకున్నా తనదోవలో తాను వెళ్తాననే సంకేతాన్నే జగన్ ఇచ్చారనేది కొంత మంది అంటున్నారు.