వైయస్ జగన్ ఆస్తులపై చిరంజీవి మెగా అటాక్
"రాష్ట్రంలో దోపిడీ ఎక్కడ జరుగుతోందో, ఎప్పుడు జరిగిందో, ఎవరు దోచుకుంటున్నారో మీకు తెలియంది కాదు, దోచుకున్న డబ్బుతో కోట్లకు పడగలెత్తి వ్యాపారాలు ఎవరు సాగిస్తున్నారో కూడా ప్రజలకు తెలుసు. నేను ప్రత్యేకించి వారి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు" ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదని, వారనుకుంటే ఏమైనా సాధించగలరని, ఛేదించగలరని, వారంతా ఒక్కసారి కన్నెర్ర చేస్తే రాజకీయ పార్టీలకు భవిష్యత్ లేకుండా పోతుందన్నారు. అవసరం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, నచ్చని రాజకీయ పార్టీలను సాగనంపడం ప్రజలకు బాగా తెలుసని, ప్రస్తుతం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో విసిగిపోయిన రాష్ట్రం ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపుతోందని, అందుకోసమే ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని వారికి అండగా తానున్నానని చాటి చెప్పేందుకు చైతన్యయాత్రలతో మీ ముందుకు వచ్చానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
సంక్షేమ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కనీసం మధ్యాహ్న భోజన పధకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన దుయ్యబట్టారు. పరిశ్రమల పేరుతో భూములను దోచుకుంటున్న భూ బకాసురులు సముద్రాన్ని సైతం వదలిపెట్టడం లేదని దీంతో మత్స్యకారుల జీవనం ఆటుపోట్లకు గురౌతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని, చిరు ద్వారానే పోయిన దానిని తిరిగి సాధించుకోవాలని, రాబట్టుకోవాలని చూస్తున్నారని అందుకు తాను సిద్ధమేనని తన ద్వారా ప్రజలు దేనినైనా సాధించుకోవచ్చునని భరోసా ఇచ్చారు.