హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివేదిక సమర్పించినట్లు వచ్చిన వార్తలపై దుమ్ము రేగుతోంది. అది తీవ్ర వివాదంగా మారింది. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఆయన చెప్పినట్లు వచ్చిన విషయాల కన్నా తెలంగాణపై చెప్పినట్లు వచ్చిన అంశాలే వివాదంగా మారాయి. రాష్ట్ర విభజన చేయాల్సి వస్తే, హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన తన నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. నరసింహన్ పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీవ్రంగా మండిపడుతోంది. హైదరాబాదును వివాదాస్పదంగా మార్చడం సరికాదని వాదిస్తోంది. నరసింహన్ రాజకీయాల్లో తలదూర్చడం సరి కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, తాను కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు వచ్చిన వార్తలను గవర్నర్ నరసింహన్ ఖండించారు. శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆయనను మీడియా ప్రతినిధులు పలుకరించినప్పుడు అదంతా రబ్బిస్ అని స్పందించారు.'నేను అధికారిక పనిమీద ఢిల్లీకి వచ్చాను. ప్రధానమంత్రిని కలిశాను' అని చెప్పారు. ఏదైనా నివేదిక సమర్పించారా అని అడిగినప్పుడు దాంతో మీకేం అవసరమని అన్నారు. సోనియాను కలిశారా? అని ప్రశ్నించినప్పుడు'నేనుచాలామందిని కలుస్తుంటాను దాంతో మీకేం అవసరం' అని వ్యాఖ్యానించారు.కొన్ని పత్రికలు తాను 35 పేజీల నివేదిక సమర్పించినట్లు వార్తలు రాశాయనీ, అదంతా పూర్తిగా అబద్ధమని ఆయనంతట ఆయనే చెప్పారు. తానెవ్వరికీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు.