దిగొచ్చిన నిర్మాతలు: పవన్ సినిమా నుంచి కొమరం తొలగింపు
నల్గొండ, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పోస్టర్లు చించి వేశారు. దీంతో థియేటర్ యాజమాన్యాలు చిత్రాన్ని నిలిపివేశాయి. దీంతో జెఎసి డిమాండుకు నిర్మాతలు తలొగ్గారు. దిగొచ్చిన నిర్మాతలు శీర్షికలోని కొమరంను తొలగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడైన కొమరం భీంపేరులోని పేరును ఉద్ధేశ్య పూర్వకంగా పెట్టలేదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపర్చకూడదనే కొమరంను తీసివేస్తున్నట్టు చెప్పారు. దీనిపై తెలంగాణవాదులు, ఓయూ జెఎసి స్పందించింది. పేరును తొలగించటం పట్ల తెలంగాణ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జెఎసి నాయకుడు రాజారాం మాట్లాడుతూ చిత్రంలోని కొమరంను తొలగించకుంటే అడ్డుకుంటామని ముందే చెప్పామని, అయినా హెచ్చరికలను ఖాతరు చేయకుండా విడుదల చేశారు. అన్నట్టుగానే మేం అడ్డుకున్నాం. ఇంతటితో ఆగేది లేదు. తెలంగాణకు చిరంజీవి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వరకు అడ్డుకునే నిర్ణయాన్ని అలోచిస్తామన్నారు. మరో జెఎసి నాయకుడు కైలాస్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పులిలా గాండ్రించిన కొమరం భీం పేరును వాడుకుంటూ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటాన్ని యావత్ తెలంగాణ వ్యతిరేకిస్తోందన్నారు. పేరును తొలగించడంతో పాటు తెలంగాణపై అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే వరకు అడ్డుకుంటామన్నారు. అరెస్టులకు, పోరాటాలకు అందరం సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యమాన్ని కొనసాగించే దిశలోనే ఆలోచిస్తామన్నారు.