అయోధ్య తీర్పుపై ఉత్కంఠ: దేశవ్యాప్తంగా హై అలర్ట్
లక్నో: అయోధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చే తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠతో పాటు తదనంతర సంఘటనలపై భయాందోళనలు కూడా చోటు చేసుకున్నారు. అరవై ఏళ్ల రామజన్మ భూమి - బాబ్రీ మసీదు టైటిల్ వివాదంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు అనంతరం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అప్రమత్తమై ఉన్నాయి. తీర్పుపై సంయమనం పాటించాలని పార్టీలకు, మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు, పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
న్యాయమూర్తులు ఎస్ యు ఖాన్, సుధీర్ అగర్వాల్, డివి శర్మలతో కూడిన అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య బెంచ్ గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తీర్పు వెలువరించనుంది. కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యాయవాదులను తప్ప ఎవరూ లోనికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. లక్నోలో హెలికాప్టర్లతో గస్తీ ఏర్పాట్లు చేశారు. కోర్టు తీర్పును అంగీకరిస్తూ శాంతిసామరస్యాలను కాపాడాలని, సంయమనం పాటించాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, హోం మంత్రి పి. చిదంబరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తీర్పు తర్వాత ఇరు పక్షాలకు చెందినవారు పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. దాంతో అలహాబాద్ హైకోర్టు తీర్పే అంతిమం కాబోదని, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ నాయకులు ఇరు వర్గాలకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యాయవ్యవస్థను గౌరవించాలని బిజెపి నాయకులు కూడా ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications