వైయస్ జగన్ ఇష్యూ: రెండో వారంలో ఢిల్లీకీ సిఎం రోశయ్య

రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 13 నెలలు పూర్తయింది. ఈ పదవీ కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను ఒకసారి విశ్లేషించడంతో పాటు భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వం సరైన బాటలో నడిచేలా రోశయ్యకు సోనియా దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందని విశ్వసిస్తున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక, తదనంతర పరిణామాలెలా ఉంటాయనే విషయాలపై అధిష్ఠానం ఇప్పటికే ఆరా తీస్తోంది. ప్రభుత్వపరంగా జరిగే మార్పుల్లో ఆ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. నివేదిక ఏ రకంగా వచ్చినా ఇబ్బందిలేని విధంగానే మంత్రివర్గంలో మార్పులుంటాయని పార్టీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్కు సహకారం ఇచ్చే ధోరణితో ఉన్నందున ఆ పార్టీ సేవలు ఎలా వినియోగించుకోవాలనే విషయంపైనా అధిష్ఠానం సీఎంతో మాట్లాడతారని తెలిసింది. చిరంజీవి అమెరికా వెళ్ళే ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారని ప్రచారం జరగ్గా పార్టీ దాన్ని ఖండించింది. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్తో చిరు భేటీ అయ్యారని మరికొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. ఇవేవీ నిజం కాదని ప్రరాపా వర్గాలంటున్నా ఆ పార్టీతో కలిసి పనిచేసే అంశానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాధాన్యత ఇస్తోందనేది విశ్వసనీయ సమాచారం. దివంగత వైఎస్ హయాంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపైఅధిష్ఠానం చాలా సీరియస్గా ఉంది. బయ్యారం గనులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలపై ఢిల్లీ నుంచే ఆదేశాలొచ్చాయి. ఇటువంటి మరిన్ని విషయాల్ని పలువురు నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళారు. వాటిపైనా సీఎంతో అధిష్ఠానం చర్చించే అవకాశముందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications