శిశువు చెవులు కోసిన డాక్టర్:విశాఖలో పాప మృతి
విశాఖపట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉండే లక్ష్మీకి సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావటంతో ఆమె భర్త మురళీ కృష్ణ మరియు బంధువులు కలిసి రైల్వే న్యూకాలనీలోని కృష్ణ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిజేరియన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంతో బిడ్డ చెవులు కోశాడు. దాంతో ఆ శిశువు మరణించాడు. అయితే డాక్టర్లు ఓ చాపలో శిశువును చుట్టి అతను పుట్టగానే చనిపోయాడని, తల్లి పరిస్థితి కూడా ఆందోళనగా ఉందని చెప్పి వారిని పంపించారు.
తెల్లవారు జామున శిశువును పూడ్చి పెట్టడానికి వెళ్లిన బంధువులు శిశువు చెవులు కోసి ఉండటాన్ని గమనించి డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని, ఆసుపత్రి ముందు శిశువు మృతదేహంతో ఆందోళన సాగిస్తున్నారు. శిశువు ప్రాణాలను బలి తీసుకున్న శ్రీనివాసమూర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము ఆందోళన చేపట్టినప్పటికీ డాక్టర్ ఇంతవరకు బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పకపోవటంపై కూడా బాధితులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు డాక్టర్ ను విచారించేందుకు ఆసుపత్రిలోకి వెళ్లారు. ఎవరినీ ఆసుపత్రిలోకి అనుమతించటం లేదు.