Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ఆదాయంపై దుమ్మెత్తిపోస్తున్న అన్ని పార్టీల నాయకులు

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై అన్ని రాజకీయ పార్టీల నాయకులు విరుచుకుపడ్డారు. ఆయన ముందస్తుగా మొదటి ఆరు నెలలకు 84 కోట్ల రూపాయల పన్ను చెల్లించడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నాయకులే కాకుండా స్వపక్షం కాంగ్రెసు నుంచి కూడా తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి. కొందరు రాజకీయ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. కడప ఎంపీ జగన్ అడ్వాన్స్ ట్యాక్స్‌గా రూ.84 కోట్లు చెల్లించడాన్ని విలేకరులు రాయపాటి దృష్టికి తీసుకురాగా ఆయన ఆ విధంగా స్పందించారు. అవినీతి మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నప్పుడు జగన్ ఆదాయంపై ఎందుకు మాట్లాడరని విలేకరులు ప్రశ్నించగా "ఆయన ఎంపీ. ఆయన గురించి నేనేమీ మాట్లాడుతా?'' అని ప్రశ్నించారు. ఏడాదిలోనే ఇంత ఆదాయ అభివృద్ధి సాధ్యమా? అని అడగ్గా "నేను వ్యాపారం చేసి కోట్లు నష్టపోతే కొంతమంది రాజకీయ వ్యాపారం చేసి కోట్లు గడించారు'' అని అన్నారు.

కడప ఎంపీ వైఎస్ జగన్ ఆర్థిక వ్యవహార శైలి చూసి దేశంలోని ఆర్థిక వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలే తలలు పట్టుకుంటున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఒక్క ఏడాదిలోనే టాటా, బిర్లా, అంబానీ సోదరులను మించిపోయిన ఆస్తులతో ఆదాయ పన్ను శాఖకు రూ.84 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం అసాధారణ విషయమని, జగన్ ఆస్తులపై తక్షణమే అత్యున్నత ధర్మాసనం సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రోశయ్యను డిమాండ్ చేశారు. ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఇన్ని కోట్ల రూపాయల లాభాలు ఎలా సంపాదించారో తెలియజేయాలని కాంగ్రెసు అమలాపురం ఎంపీ హర్షకుమార్ కడప ఎంపీ జగన్‌ను ప్రశ్నించారు. జగన్ అడ్వాన్స్ ట్యాక్స్‌పై మంగళవారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జగన్ ఆ కిటుకు చెబితే ప్రపంచానికి మేలు చేసిన వారవుతారని అన్నారు.

ఆస్తుల సంపాదనకు ఆదాయ వనరులు ఏమిటో.. ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టారో కడప ఎంపీ వైఎస్ జగన్ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన నివాసంలో మంగళవారం పాల్వాయి విలేకరులతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఇంత పెద్దమొత్తంలో అడ్వాన్సుగా చెల్లించడం ఐటీ శాఖకూ కేంద్ర ప్రభుత్వానికీ సవాల్‌గా పేర్కొన్నారు. అధిష్ఠానాన్ని జగన్ ధిక్కరించడానికి ఆదాయమే ప్రధాన కారణమని పాల్వాయి అన్నారు. తమకు వైఎస్‌పైన గౌరవం ఉందన్నారు. కాని, ఆయన హయాంలో కొంతమందితో కలసి చేసినవన్నీ ఇప్పుడు కుంభకోణాల రూపంలో బయట పడుతున్నాయని పాల్వాయి పేర్కొన్నారు. జగన్ ఇన్ని కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను చెల్లింపుపై విచారించాల్సి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కె.యాదవ్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+