వైయస్ జగన్ క్యాంపుపైనే సిఎం రోశయ్యతో డి. శ్రీనివాస్ చర్చ

కడప ఎంపీ జగన్మోహనరెడ్డి ధిక్కార ధోరణని కూడా దృష్టిలో ఉంచుకునే సోనియా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమనే భావన పార్టీ శ్రేణుల్లోకి పంపి మరింత పటిష్ఠపరచాలనేది ఆమె ఉద్దేశంగా నేతలు భావిస్తున్నారు. సోనియా ఆదేశాన్ని సీఎం ఇప్పటికే మంత్రివర్గ సమావేశం సందర్భంగా మంత్రులకు వివరించారు. ఆ మేరకు పార్టీని ముందుకు నడపడంలో సహకరించాలని వారిని కోరారు. ఈ నేపథ్యంలోనే రోశయ్య డీఎస్తో భేటీ అయ్యారు. పార్టీలో తలెత్తుతున్న క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించరాదనే అంశం వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు స్థానిక నేతలపై చర్యల విషయంలో పీసీసీ కఠినంగానే వ్యవహరిస్తోంది. కొంతమందిని సస్పెండ్ చేయగా మరికొందరికి షోకాజ్ నోటీసులిచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేల స్థాయిలో నడుస్తున్న ధిక్కార కార్యకలాపాలపై డీఎస్ ఢిల్లీకి ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారు. పెద్ద నేతల విషయం తమకు వదిలిపెట్టి పీసీసీ, డీసీసీ స్థాయిలో చేపట్టాల్సిన చర్యల విషయంలో మాత్రం వెనుకాడవద్దని అధిష్ఠానం డీఎస్కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.వీటన్నింటిపైనా ముఖ్యమంత్రి, డీఎస్ చర్చించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications