చిరంజీవికి శోభారాణి మరోసారి షాక్: మళ్లీ లేఖాస్త్రం
పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోటగిరి విద్యాధరరావుకు లేఖ రాశారు. 'నాపై చర్యలు తీసుకునే ముందు చిరంజీవి ఆశయాలను పని గట్టుకుని నాశనం చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలి. మనకి వ్యతిరేక వర్గమైన జగన్ను ఆకాశానికి ఎత్తి పార్టీ ప్రతిష్ఠను మంట కలిపిన అనేకమంది నేతలపై చర్యలెందుకు తీసుకోరు? విజయవాడలో చిరంజీవిని దూషించిన వంగవీటి రాధాకృష్ణపై చర్యలు తీసుకోని క్రమశిక్షణ సంఘానికి నామీద చర్యలు తీసుకునే హక్కు ఎక్కడిది? టికెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు చేసిన పద్మపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎంతో ఆశతో పార్టీ కార్యాలయానికి వస్తున్న వికలాంగులకు లోపలికి రావడానికి అనుమతి ఇవ్వని వారిపై చర్యలు తీసుకోండి. మొదటి నుంచీ సామాజిక న్యాయం కోసం పాటుపడిన నాపై చర్యలు తీసుకోవడం ఏమిటి? ఈ విషయాలకు సమాధానం చెప్పిన తర్వాతే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతాను' అని ఆమె ఆ లేఖలో అన్నారు.
తమకు శోభారాణి లేఖ రాసిన విషయం నిజమేనని కోటగిరి విద్యాధర రావు అంగీకరించారు. అయితే, దాన్ని ఇంకా చదవలేదని, అందులో ఏముందో తెలియదని ఆయన అన్నారు. త్వరలో క్రమశిక్షణా సంఘం సమావేశం ఏర్పాటు చేసి తగిన విధంగా స్పందిస్తామని ఆయన చెప్పారు.