జైపాల్ రెడ్డిని సిఎం పదవికి ఎగదోస్తున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు
ముఖ్యమంత్రిగా మద్దతు ఉంటుందని చెప్పడానికే సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు బుధవారం రాత్రి జెడి శీలం నివాసంలో జరిగిన సమావేశానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు జైపాల్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో జైపాల్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నంది ఎల్లయ్య, ఖాన్ పాల్గొన్నారు. మిగతా తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు రాలేదు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పుపైనే చర్చ జరిగినట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మార్పు వార్తాకథనాలపై మాట్లాడడానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గురువారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో నిరాకరించారు. ఆ విషయం తనకు తెలియదని, తాను వరద బాధితులను పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా తెలంగాణపై డిసెంబర్ తర్వాత తలెత్తే ఉద్యమాల ఉధృతిని తగ్గించవచ్చుననేది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎత్తుగడగా భావిస్తున్నారు.