లక్ష్మీపార్వతి వెనక వైయస్ జగన్: చంద్రబాబుపై ఆరోపణలు?
చంద్రబాబుపై ధ్వజమెత్తడానికి లక్ష్మీపార్వతి పకడ్బందీ స్క్రిప్టును సిద్ధం చేసుకున్నారు. ఆ స్క్రిప్టు కూడా వైయస్ జగన్ నేతృత్వంలో జరిగిందని అంటున్నారు. అందుకు అవసరమైన సామగ్రి సేకరణ అంతా అక్కడి నుంచే జరిగిందని కూడా ప్రచారం జరుగుతోంది. అంది వచ్చిన అవకాశాన్ని లక్ష్మీపార్వతి వాడుకున్నారు. ఎన్టీఆర్ కు కుమారులు కూడా తిండిపెట్టలేదని జగన్ ఓదార్పు యాత్ర ముగింపు సభలో లక్ష్మిపార్వతి విమర్శించారంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆ రకంగా ఆయన తేనెతుట్టెను కదిపారు. ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో కూడా అదే విషయంపై ఆమెను తీవ్రమైన ఇబ్బందుల్లో పెట్టారు. దాంతో ఆమె ఆత్మరక్షణలో పడిపోయారు. అలా పడిపోవడం ఇష్టం లేని లక్ష్మీపార్వతి పకడ్బందీగా చంద్రబాబుపై పాతకథనంతా తవ్వారని అంటున్నారు.
ఎన్టీఆర్ కుమారులను వెనకేసుకొస్తూనే ఆమె చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును కూడా ఆమె ఏమీ అనలేదు. ఒకరకంగా దగ్గుబాటి పట్ల ఆమె సానుకూల వైఖరి ప్రదర్శించారు. టార్గెట్ చంద్రబాబు కాబట్టి అందుకు అనుగుణంగానే ఆమె వ్యాఖ్యలు సాగాయి.