రోశయ్య తుమ్మితే ఊడే ముక్కు, జగన్ కే సమర్థత: అంబటి రాంబాబు
ఓదార్పుపై ఏఐసీసీ స్పందించకున్నా, పీసీసీ మాత్రం దివంగత వైఎస్ఆర్ను స్మరిస్తున్న నేతలను, జగన్కు తోడుగా ఉంటున్న వారిని ప్రత్యేకంగా వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రూ. రెండు కోట్లు, అమెరికా ఉద్యోగం ఆఫర్ ఇచ్చినా కాంగ్రెస్ను వీడని చరిత్ర చెవిరెడ్డిదని చెప్పారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు ప్రత్యక్ష శత్రువుగా ముద్రపడిన చెవిరెడ్డి 2004లో 40 క్రిమినల్ కేసులు ఎదుర్కొని రెండు నెలలు జైలు జీవితం గడిపారని తెలిపారు.
గ్రూప్-1 పరీక్షలప్పుడు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉద్యమకారులతో కలిసి కళాశాలల్లోకి దౌర్జన్యంగా వెళ్లి పేపర్లను బయటకు తేవడం ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదా..? అని ఆయన అంబటి ప్రశ్నించారు. ఎంపీ మధుయాష్కీ నేరుగా గవర్నర్పై విమర్శలు చేసినా, రాష్టప్రార్టీ వ్యవహారాల ఇన్చార్జి వీరప్ప మొయిలీపై దామోదర్రెడ్డి ఆరోపణలు చేసినా అధిష్టానం మౌనం వహించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సొంత పార్టీ మంత్రి పొన్నాలపైనే అవినీతి ముద్ర వేస్తూ గవర్నర్ను కలిసిన వారిపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చర్యలు చేపట్టదని నిలదీశారు. అధిష్టానం చెవులు పెద్దవి, కళ్లు చిన్నవిగా చేసుకుని వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఏఐసీసీ ప్లీనరీకి మారెప్ప, కొండా సురేఖలకు ఆహ్వానం పంపకపోవడంలో వ్యూహం నడిపిన పెద్దలెవరో తమకు తెలుసన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై చర్యలపై ఏఐసీసీ, పీసీసీ పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.