నటుడు ఫిరోజ్ ఖాన్ భూమిని కొట్టేసిన కర్ణాటక సిఎం యడ్యూరప్ప
బెంగళూరుకు చెందిన ఖాన్ తొలుత ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఉంటుందనే ఉద్దేశంతో తన భూమి కోల్పోయినా చాలా కాలం ఏమీ మాట్లాడలేదు. ఆ భూమిని యడ్యూరప్ప కుమారులకు కేటాయించరనే విషయం వెలుగులోకి రావడంతో వివాదం చెలరేగింది. శక్తివంతమైన రాజకీయ నేతలపై పోరాటం చేయలేక ఆయన స్థానిక కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఫిరోజ్ ఖాన్ స్థాపించిన సూపర్ కాస్ట్ అండ్ మల్లియెబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి ఆర్ గుండూరావు 9 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, 2007లో యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రి కాగానే ఏ పరిశ్రమనూ స్థాపించలేదనే కారణంతో ఆ స్థలాన్ని బోర్డు ద్వారా స్వాధీనం చేసుకునే ఏర్పాట్లు చేశారని, దాంట్లో రెండెకరాల స్థలాన్ని యడ్యూరప్ప కుమారులకు కట్టబెట్టారని ఫిరోజ్ ఖాన్ న్యాయవాది చెప్పారు. కేటాయించి రెండేళ్లు పూర్తయినా ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదని, అందుకే ఫిరోజ్ ఖాన్ నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నామని కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాభివృద్ధి బోర్డు అధికారులు చెబుతున్నారు.