బెజవాడలో మద్దెలచెర్వు సూరి గ్యాంగ్ సెటిల్మెంట్?

గతంలో ఒక ప్రముఖ చలనచిత్ర పంపిణీ సంస్థలో పనిచేసి ప్రస్తుతం అన్నపూర్ణ ప్యాకేజింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నడుపుతున్న వేమూరి సుభాష్చంద్రబోస్ కుటుంబంలో వచ్చిన వివాదమే నగరంలో సూరి గ్యాంగ్, హోం మంత్రి బంధువుల ఎంట్రీకి కారణమైందని ప్రచారం జరుగుతోంది. బోస్కు శ్యాంప్రసాద్, కృష్ణప్రసాద్ అనే ఇద్దరు కుమారులున్నారు. శ్యాంప్రసాద్పై అతని తమ్ముడు కృష్ణప్రసాద్ భార్య విజయవాడలో ఇప్పటికే వర కట్న వేధింపుల కేసు పెట్టారు. ఈ కేసులో శ్యాంప్రసాద్, ఆయన కుటుంబీకులు ముందస్తు బెయిల్ పొందారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. శ్యాంప్రసాద్ కూడా సోదరుడిపై ఎదురు కేసులు పెట్టారు. కృష్ణప్రసాద్ భార్య పేరిట ఉన్న ఆస్తులను శ్యాం ప్రసాద్ అమ్మేశారన్న ఆరోపణలున్నాయి.
కొంతకాలం కిందట భార్య చనిపోవడంతో శ్యాంప్రసాద్ రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య కుటుంబీకులు ఇటీవలే సెటిల్మెంట్ చేసుకున్నారు. అన్నదమ్ముల మ«ధ్య వివాదాలు ముదరడంతో అనేకమంది నగర ప్రముఖుల వద్ద పంచాయితీలు జరిగాయి. తన భార్యకు కట్నంగా ఇచ్చిన ఆస్తులను వెనక్కి ఇవ్వాలని కృష్ణప్రసాద్ కోరుతుండగా కేసుల ఉప సంహరణకు శ్యాం ప్రసాద్, ఆయన తండ్రి పెద్ద మనుషుల ద్వారా ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో, కృష్ణప్రసాద్, ఆయన భార్య హోం మంత్రి వద్దకు వెళ్లి తమ కంపెనీలో కోట్లాది రూపాయలు తినేశారని, దీనిపై సీఐడీ దర్యాప్తు చేయించాలని కోరారు. దీంతో తనయుడు లేదా బంధువుగా భావిస్తున్న కార్తీక్రెడ్డి, మరో 15 మంది వచ్చి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేశారని గుప్పుమంది. మొత్తం ఆస్తిని కృష్ణప్రసాద్, ఆయన సతీమణి పేరిట రాయించి బోస్, శ్యాంప్రసాద్ లతో సంతకాలు చేయించుకున్నారని చెబుతున్నారు.
ఈ వ్యవహారాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారంటున్నారు. తమ మధ్య ఆస్తి వివాదం ఉన్న విషయం వాస్తవమేనని, కానీ ఎవరూ ఇందులో జోక్యం చేసుకోలేదని, సెటిల్మెంట్ కూడా చేయలేదని కృష్ణప్రసాద్ చెప్పారు. ఈ వివాదంపై సినీ నటుడు కృష్ణ సోదరుడు, ఒక ప్రముఖ ఆడిటర్, మరికొంతమంది పెద్దల సమక్షంలో కొద్ది రో జులుగా చర్చలు జరుగుతున్నాయని ఆన్లైన్ ప్రతినిధితో వివరించారు.
కార్తీక్ రెడ్డి, మద్దెలచెరువు సూ రి వంటి వారెవరూ తమకు తెలియదని చెప్పారు. బోస్ కూడా హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడారు. ఆస్తులను బలవంతం గా రాయించుకున్న మాట యధార్థం కాదన్నారు. ఈ సమాచారం మీకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. శ్యాం ప్రసాద్తో మాట్లాడించాలని కోరగా ఫోన్ పెట్టేశారు. తర్వాత చాలాసేపటికి ఫోన్ లో మాట్లాడిన శ్యాంప్రసాద్ ముక్తసరిగా మాట్లాడారు.
మిమ్మల్ని బెదిరించి సంతకాలు చేయించుకున్న విషయం వాస్తవమేనా? అని ప్రశ్నించగా అవునన్నారు. తాను బయలుదేరి వస్తున్నానని చెప్పారు. తనను చంపేందుకు సూరి మనుషులు ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో హోంమంత్రి కుమారుడి పేరు చెప్పుకొని వచ్చిన వ్యక్తి వెంట సూరి మనుషులు విజయవాడలో ప్రవేశించారని వచ్చిన వార్తలు నగరంలో కలకలం రేకెత్తించాయి. ఈ విషయంపై 'ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి' సీపీ సీతారామాంజనేయులతో మాట్లాడగా ఈ వ్యవహారం తమ దృష్టికి రాలేదని, అటవంటి సమాచారం ఏదీ తన వద్దలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications