కెసిఆర్, సోనియా గాంధీలను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే కొండా సురేఖ
మంత్రి పదవులు తీసుకునేవారు డిసెంబర్ 31 తరువాత రాజీనామాకు సిద్ధపడతారా అని ఆమె ప్రశ్నించారు. స్పీకరు, ఉపముఖ్యమంత్రి పదవులు ఎరచూపి పార్టీ అధిష్టానం తెలంగాణను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. కెసిఆర్ తో పార్టీ నాయకుల మంతనాల రహస్యాలు ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. డిసెంబర్ 31న తెలంగాణ రాకుంటే తాను ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని ఆమె ప్రకటించారు. జగన్ ది దుందుడుకు చర్య కాదని ఆమె స్పష్టం చేశారు. ఆయన అన్నీ ఆలోచించే చేస్తున్నారన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతిపై రాష్ట్ర ప్రజలకు అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదం మృతిపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం కేంద్రానికి ఉందన్నారు. జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద జగన్ పై విమర్శలు చేయటం ఆయన ఒంట్లో పుట్టింది కాదన్నారు. ఆయనతో అధిష్టానం ఆట ఆడిస్తుందన్నారు.