కిరణ్ కుమార్ రెడ్డికి సోనియా గాంధీ అక్షింతలు: జగన్ సాక్షి వ్యాఖ్య
ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారని తెలుస్తోంది. మీరు సమస్యలు సృష్టిస్తుంటే మేం పరిష్కరించుకుంటూ వెళ్లాలా అని ఆమె అడిగినట్లు తెలుస్తోంది. పార్టీ పార్లమెంటు సభ్యులను మీరు ఎందుకు సంప్రదించడదం లేదని, అందులో మీకున్న ఇబ్బందులేమిటని ఆమె కిరణ్ ను అడిగారని సమాచారం. దీంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను తనకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవాలనుకున్న కిరణ్ వ్యూహం దెబ్బ తిన్నదని, ఆ పదవుల గురించి సోనియాతోనే మాట్లాడలేదని తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఆరు నెలల పాటే ఉంటారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోందని సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. ఏది అడిగినా సోనియా గాంధీ ఆరు నెలల తర్వాతనే అని అన్నారని చెప్పింది. దీంతో శాసనసభా శీతాకాలం సమావేశాలు స్పీకర్ లేకుండానే జరుగుతాయని అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో శాసనసభ నడిపించాలని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి స్పీకర్ పదవితో పాటు ఇతర పదవుల ఎంపిక కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.