వైయస్ జగన్మోహన్ పార్టీ తెలంగాణ కన్వీనర్ గా కొండా సురేఖ
జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మేం తెలంగాణకు అనుకూలమేనని ఆమె చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణపై భవిష్యత్తు రూపొందిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర అన్నప్పటికీ ఆ పార్టీ తెలంగాణ నేతలు తెలంగాణ కోసం పోరాడుతున్న విధంగానే మా పోరాటం ఉంటుందన్నారు. జగన్ తో సమావేశమయి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. జగన్ పెట్టే పార్టీలో తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానన్నారు. నిరంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.
వైయస్ రాజశేఖరరెడ్డి నిర్ణయాలు మా ఊహకు అందేవి కాని జగన్ నిర్ణయాలు మాత్రం మా ఊహకు అందడం లేదన్నారు. జగన్ కు వైయస్ కన్నా ఎక్కువ రాజకీయ అవగాహన ఉందన్నారు. జగన్ కు ప్రజల అండ ఉందని చెప్పారు. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వారు పార్టీ పెడితే విఫలమవుతున్నారనే వాదనల్లో నిజం లేదన్నారు. అయితే 90 శాతం మంది విఫలమైనా, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి వారి పది శాతం మందిలో జగన్ కూడా ఉండవచ్చని ఆమె చెప్పారు.