Amma Canteens: అమ్మ క్యాంటీన్ల కొత్త రికార్డు- విజయ్ ఒక్క నిర్ణయంతో..!
తమిళనాడులో ఎప్పుడో 2013లో జయలలిత హయాంలో పుట్టిన అమ్మ క్యాంటీన్లు (Amma Canteens) ప్రస్తుతం దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో పేదల కడుపు నింపుతున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం వీటి పరిస్ధితి అంతంతమాత్రంగా ఉండటంతో అక్కడ ఏర్పడిన విజయ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అధికారంలోకి రాగానే అమ్మ క్యాంటీన్లపై వచ్చిన ఫిర్యాదులపై వీటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీంతో ఇప్పుడు ఒక్క చెన్నై మహానగరంలోనే అమ్మ క్యాంటీన్లకు రద్దీ 55 శాతం పెరిగిపోయింది.
విజయ్ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఆధునికీకరణ, పునర్నిర్మాణ చర్యల తర్వాత ఈ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో నెలల వ్యవధిలోనే రోజువారీ ఇక్కడికి వచ్చే పేదల సంఖ్య ఏకంగా 55 శాతం మేర పెరిగిందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రోజువారీ ఆదరణ 67,164 ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.04 లక్షలు దాటి కొత్త రికార్డు సృష్టించింది. అమ్మ క్యాంటీన్లలో కొన్నేళ్లుగా ఆహార నాణ్యత లోపించడం, వసతులు క్షీణించడంతో వీటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీవీకే సర్కార్ వీటి రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది.

భారీగా నిధులు కేటాయించి చెన్నై నగర వ్యాప్తంగా ఉన్న 383 అమ్మ క్యాంటీన్లలో మరమ్మతులు చేపట్టారు. వంటగదులలో పాతబడిన పాత్రలను మార్చడం, ఆధునిక కటింగ్ పరికరాల ఏర్పాటు, నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే ఆహార నాణ్యత, రుచిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిసరాల పరిశుభ్రతతో పాటు వంట వండే సిబ్బంది కఠిన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సానుకూల మార్పులతో కార్మికులు, సామాన్య ప్రజలు మళ్లీ అమ్మ క్యాంటీన్ల బాట పడుతున్నారు.














Click it and Unblock the Notifications