మంత్రి శంకర్ రావుపై వైయస్ జగన్ వర్గం నేతల ఫైర్
మంత్రి శంకర్ రావు వ్యాఖ్యలు సరికావని శాసనసభ్యుడు శేషారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు బలం ఉందో, జగన్ కు బలం ఉందో ప్రజల్లో తేల్చుకుందా రండి అన్నారు. జగన్ మద్దతుదారుల రాజీనామా కోరుతున్న వారు మొదట వారు రాజీనామా చేసి వైయస్ బొమ్మ లేకుండా గెలవాలని కొండా సురేఖ అన్నారు. అలా అయితే తాము రాజీనామాకు సిద్ధం అని కొండా సురేఖ తేల్చి చెప్పారు. అధిష్టానం రాజీనామా చేయాలని కోరితే రాజీనామా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు అన్నారు.
శంకర్ రావు కూడా రాజీనామా చేసి మళ్లీ పోటీకి సిద్ధపడాలని అప్పుడే ఎవరికి ఎక్కువ మద్దతు ఉందో తెలుస్తుందన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కూడా శంకర్ రావుపై ధ్వజమెత్తారు. జగన్ మద్దతుదారులను రాజీనామా చేయమని అడిగే హక్కు మంత్రి శంకర్ రావుకు లేదని సబ్బం హరి అన్నారు. శంకర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్లే ఆయనకు మంత్రి పదవి లభించిందని సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా అన్నారు.