సిఎం సాయం ప్రకటించాకే మరణాలు పెరిగాయి: చిరంజీవి
సాయం ప్రకటించక ముందు ప్రభుత్వం తమకు అనుకూలంగా సాయం అందిస్తుందని రైతులు వేచి చూశారని, అయితే ముఖ్యమంత్రి సాయం ప్రకటన తర్వాత అదేమీ సరిపోదని తెలిసి వారు మరణించారన్నారు. తెచ్చిన అప్పును తీర్చలేక భవిష్యత్తు కనిపించలేక కొందరు గుండె ఆగి, మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని మరణించారన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు హెక్టారుకు 10వేల రూపాయలను వెంటనే ప్రకటించాలన్నారు. మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో హెక్టారుకు 10వేల రూపాయలు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రతిపక్షంలోని అన్ని పార్టీలు ఆ సాయం సరిపోదని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. దాంతో రోజుకు 20కి పైగా రైతులు మరణిస్తున్నారన్నారు. అంతే కాకుండా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మేమున్నామని ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచే టెక్నిషియన్లు లేరు. వారిని అందుబాటులో ఉంచాలని చెప్పారు.