కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు బిక్షం వేసింది: ప్రకాశ్ కరత్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల రైతులందరూ తీవ్రంగా నష్టపోయి బాధల్లో ఉన్నారన్నారు. ఈ ఒక్క సంవత్సరమే 17వేలకు పైగా దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం రైతులను ఎలా నిర్లక్ష్యం చేస్తుందో తెలుస్తుందన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కేంద్ర ప్రభుత్వ లెక్క ప్రకారం రెండువేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వ్యవసాయాన్ని, రైతాంగాన్ని రక్షించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలకు గ్రామీణ స్థాయిలో ఉద్యమాన్ని నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చంద్రబాబు దీక్ష చేస్తున్న సందర్భంగా మేమంతా ప్రధానిని కలిసి వ్యవసాయరంగాన్ని ఆదుకోవాలని కోరితే 400 కోట్ల రూపాయలు మాత్రమే ముష్టి వేసినట్లు వేశారని విమర్శించారు.
రైతులను అదుకోవడానికి డబ్బులు లేవన్న ప్రధాని కోట్లాది అవినీతికి ప్రత్యక్ష సాక్షి అన్నారు. వ్యవసాయంలో ఉన్న రైతాంగం రోజూవారీ జీవితానికే కష్టంగా ఉండగా పెద్దవారి ఆదాయాలు మాత్రం పెరిగి పోతున్నాయన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం అమలు జరపటం లేదని విమర్శించారు. పెద్దలకు కార్లలో తిరగడానికి తక్కువ వడ్డీకి అప్పు ఇస్తున్న ప్రభుత్వం రైతులకు మాత్రం ఇవ్వడం లేదన్నారు. రైతాంగానికి నిధులు లేకున్నా 2జి వంటి కుంభకోణాల్లో కోట్లాది రూపాయలు తినడానికి డబ్బులు దొరికాయన్నారు.
అవినీతిపరులనుండి డబ్బులు రాబట్టి రైతులకు సరియైన న్యాయం చేయవచ్చున్నారు. రాష్ట్ర రైతాంగంలో కౌలుదారులకు కూడా సరియైన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. ఇక్కడి గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ సభ ప్రారంభం మాత్రమే అన్నారు. ఇది రాబోయే కాలంలో పోరాటానికి కృషి చేస్తుందన్నారు. సిపిఎం తరఫున రైతాంగానికి అండగా ఉండటానికి అన్ని పార్టీలతో కలిసి పోరాడుతామన్నారు.