సూరి హత్య కేసు భాను కిరణ్ అసలు ఎక్కడున్నాడు?
అయితే, భాను కిరణ్ పూణేలో ఉన్నాడని అంతకు ముందు వార్తలు వచ్చాయి. భాను కిరణ్ తనకు సన్నిహితులైన సుబ్బు, గణేష్ల సహకారంతో పారిపోయాడని వార్తలు వస్తున్నాయి. భాను కిరణ్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని టీవీ చానెళ్లు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినా, అతను పోలీసులకు చిక్కలేదనే అంటున్నారు.
కాగా, సూరిని భాను కిరణ్, మధుమోహన్ రెడ్డి కలిసి హత్య చేశారని సూరి అనుచరుడు వాసుదేవ రెడ్డి ఆరోపిస్తున్నాడు. వివిధ టీవీ చానెళ్ల ప్రతినిధులతో అతను మాట్లాడాడు. మధుమోహన్ రెడ్డి చెబుతున్న మాటలే ఆ అనుమానాలకు తావిస్తున్నాయని అతనేది అభిప్రాయం. మధుమోహన్ చెబుతున్న మాటల్లో ఏవి అనుమానాస్పదంగా ఉన్నాయో కూడా అతను చెప్పాడు. కాగా, సూరిని ఎక్కడో హత్య చేసి, యూసుఫ్ గూడాలో హత్య జరిగినట్లు చిత్రీకరించారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భాను కిరణ్ డైరీ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఆ డైరీ ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరిటాల రవి హత్య దగ్గరి నుంచి అన్ని వివరాలు ఆ డైరీలో ఉన్నట్లు మీడియా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. భాను డైరీలో కొంత మంది తారలకు, నిర్మాతలకు చెల్లించిన మొత్తాల వివరాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
విజయవాడకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి వివరాలు కూడా అందులో ఉన్నాయని చెబుతున్నారు. కాగా, సూరి హత్యకు పరిటాల రవి వర్గానికి చెందినవారు సుపారీలను కుదిర్చి పెట్టారని అంటున్నారు. మొత్తంగా, సూరి హత్య కేసులో చిక్కులు చాలా ఉన్నాయి. ఈ కేసును ఛేదించడం అంత సులభం కాదని అంటున్నారు.
తాము భాను కిరణ్ అక్కాబావలను విచారిస్తున్నామని పోలీసు కమిషనర్ ఖాన్ ఆదివారం చెప్పారు. అయితే, భానుతో చాలా కాలంగా తమకు సంబంధాలు లేవని బావ బ్రహ్మానందం చెబుతున్నారు. సూరి హత్య ఎలా జరిగి ఉండవచ్చుననే విషయాలపై టీవీ మీడియా స్కెచ్లు వేసి వివరిస్తోంది.