చంద్రబాబు తెలంగాణ ఎత్తులు: నాగంకు పోటీగా దేవేందర్ గౌడ్ పాచిక

పార్టీ నేతల ప్రతిపాదన మేరకు తెలంగాణలో పార్టీ వ్యవహారాలను సమన్వయ పరిచేందుకు ఒక కమిటీని వేయాలని పార్టీ అధినేత చంద్రబాబు భావించారు. ఇందుకోసం తన నివాసంలో ఉదయం తెలంగాణ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా నాగం జనార్దన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, నామా నాగేశ్వరరావు, దేవేందర్గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లను నియమించాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే కమిటీలో తమ మాట వినేవారు ఎవరూ లేరనే ఆగ్రహంతో ఈ సమావేశానికి నాగం, ఎర్రబెల్లి, కడియం శ్రీహరి హాజరు కాలేదు. కొందరు ఎమ్మెల్యేలతో ఈ ముగ్గురు నాగం ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఉమా మాధవరెడ్డి, హరీశ్వర్రెడ్డి, మహేందర్రెడ్డి, కె.ఎస్.రత్నం, గంప గోవర్దన్ తదితరులు హాజరయ్యారు. కమిటీ కాకుండా తెలంగాణకు ప్రత్యేకశాఖను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నాగం డిమాండు చేశారు. దీంతో కలకలం రేగింది. అదే సమయంలో చంద్రబాబు నివాసంలో తెలంగాణకు చెందిన సీనియరు నేతలు సమావేశమయ్యారు.
పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, రమేష్ రాథోడ్, ఎల్.రమణ తదితరులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాను పిలిచినా ఆ ముగ్గురు నేతలు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు.. మధ్యాహ్నం 3.30కు తన నివాసంలో మళ్లీ సమావేశం ఉందని, హాజరు కావాలని తెలంగాణ నేతలందరినీ పిలిచారు. నాగం ఇంట్లో సమావేశమైన నేతలకూ ఫోన్ చేసి సమావేశానికి రావాలని సూచించారు. కానీ నాగం, ఎర్రబెల్లి, కడియంలకు ఫోన్ చేయలేదు. ఉదయం ఫోన్ చేసినా వారు రాలేదని, అందుకే మళ్లీ రమ్మని చెప్పలేదని పార్టీ నేతలు తెలిపారు. ఆ ముగ్గురూ మినహా మిగతా వారంతా చంద్రబాబు నివాసానికి వచ్చారు. వారితో భేటీలో ఆయన స్పష్టంగా మాట్లాడినట్లు సమాచారం. ఏ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఆ ప్రాంత నాయకులు వ్యవహరించేలా నిర్ణయం తీసుకున్నామని, ఆ మేరకు నాయకులకు స్వేచ్ఛ ఇచ్చామని అన్నట్లు తెలిసింది. శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పార్టీని ఇబ్బందిపెట్టేలా ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయాలనడం సరికాదని ఆయన అన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications