జగన్ వెంట ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్: డిఎస్
నేను తెలంగాణవాదినేనని అయితే తనకు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. అయితే పిసిసి అధ్యక్షుడిగా అన్ని ప్రాంతాలవారిని సమానంగా చూడాల్సిన బాధ్యత, నడిపించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులు అధిష్టానాన్ని ఒప్పించే విధంగా ప్రవర్తించాలన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నాం కాబట్టి అధిష్టానాన్ని ఒప్పించి తీసుకోవాలి అని చెప్పారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేదని డిఎస్ అన్నారు. కమిటీ నివేదిక ఎవరికి అనుకూలమో, ఎవరికి వ్యతిరేకమో ఊహించుకోవడం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీనుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీకి విరుద్దంగా ప్రవర్తించడం సబబుకాదన్నారు. నేతల వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదిక పంపుతున్నామన్నారు. నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమని, తెలంగాణ అంశంపై నిర్ణయం పార్టీ అధిష్టానం చెబుతుందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అదనపు బలగాలు అవసరం లేదని డిఎస్ అభిప్రాయపడ్డారు.