రాజీనామాలపై వెనక్కి తగ్గిన ఎంపీలు: సమావేశం రద్దు కోరుతున్న ఎంపీలు?
సమావేశం ఏర్పాటు చేస్తే రాజీనామాలకు కొందరు నేతలు డిమాండ్ చేసే అవకాశం ఉన్నందున సమావేశాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని ఇన్నాళ్లు పలికిన నేతలకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. తెలంగాణ రాకుంటే రాజీనామా అని ఇన్నాళ్లు ప్రకటించిన వాళ్లు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నారు. గత నెల రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాకుంటే తన ఏఐసిసి పదవిని ఇలా వదిలేస్తానని ప్రకటించిన కె కేశవరావు ఇటీవల రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందని అని ప్రశ్నించడం గమనించదగ్గ విషయం.
ఇన్నాళ్లూ రాజీనామాలు అంటూ మాట్లాడిన నేతలు ఇప్పుడు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. సమావేశం ఏర్పాటు చేస్తే రాజీనామాకు ఎవరైనా డిమాండ్ చేయవచ్చనే ఉద్దేశ్యంతోనే ఎంపీలు వెనక్కు తగ్గుతున్నట్లు తెలస్తోంది. రేపటి సమావేశం యథావిధిగా జరుగుతుందని, సమావేశం రద్దు కాదని కాంగ్రెసు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి స్పష్టం చేశారు. కాగా కేంద్రమంత్రి జైపాల్రెడ్డి ఇంట్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సుదర్శన్రెడ్డి, డికె అరుణలు భేటీ అయ్యారు. తెలంగాణ, శ్రీకృష్ణ నివేదిక తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.