తెలంగాణ ఎంపీల హెచ్చరికలకు దిగొచ్చిన హైకమాండ్: ఢిల్లీకి పిలుపు
తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటి సమర్పించిన నివేదిక, భవిష్యత్తు కార్యాచరణపై కేంద్రం నిర్ణయం తీసుకోవడానికే ఈ పిలుపు అని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రం నివేదికను పక్కకు పెట్టి తెలంగాణ ప్రకటించకుంటే రాజీనామాకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు చెందిన పార్టీ నేతలంతా మంగళవారం సాయంత్రం కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే ఏం చేద్దామనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది.
ప్రణబ్తో సమావేశంలో అధిష్టానం వారికి కొన్ని సూచనలు చేసే అవకాశముంది. పార్టీకి వ్యతిరేకంగా, రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని చెప్పే అవకాశముంది. నివేదిక అనంతరం తెలంగాణ పరిస్థితులపై, వారి అభిప్రాయాలు అధిష్టానం తీసుకొని వారికి రాజీనామాలు వద్దని సూచించే అవకాశముందని తెలుస్తోంది. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే గతంలోలాగా అందరమూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతామని సీమాంధ్ర ఎంపీలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ఎంపీలను పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.