రియల్టర్ ఆత్మహత్య వెనక భాను కిరణ్ పాత్ర, పోలీసుల విచారణ?
ఖానామెట్ లోని సర్వే నెంబరు 41/ 12, 13, 14లలో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు శ్రీకాంత్గౌడ్ అనే వ్యక్తి తనతో ఒప్పందం కుదర్చుకున్నాడని, అడ్వాన్సుగా రూ.25 లక్షలు చెల్లించాడని ఆ లేఖలో మస్తాన్రావు పేర్కొన్నాడు. కాని ఆ స్థలాన్ని రిజిస్టర్ చేయించుకోకపోగా ఏడాది తర్వాత శ్రీకాంత్గౌడ్ తన మనుషులతో వచ్చి చంపుతానని బెదిరించాడని వివరించాడు. దీనిపై మదాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పైగా తనపైనే కేసులు పెట్టారని పేర్కొన్నాడు. శ్రీకాంత్గౌడ్, మంగలి కృష్ణలు తనను వెంటాడుతున్నారని, చంపేందుకు ప్రయత్నించగా మూడు, నాలుగుసార్లు తప్పించుకున్నానని మస్తాన్రావు వివరించాడు. పైగా తామంతా ముఖ్యమంత్రి వై.ఎస్. కుమారుడు జగన్ మనుషులమని, ఎలాగైనా చంపుతామని బెదిరించారని, ఈ పరిస్థితుల్లో విధిలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లేఖ రాసిన మస్తాన్రావు పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు.
దీనిపై 2008 మే 12వ తేదీన మాదాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో మంగలి కృష్ణ ప్రమేయం ఉన్నట్లు మస్తాన్రావు లేఖ ద్వారా వెల్లడవుతోంది. మంగలి కృష్ణ ఇటీవల హత్యకు గురైన సూరికి అనుంగు అనుచరుడన్న సంగతి అందరికీ తెలిసిందే. భాను మరో అనుచరుడిగా చలామణి అవుతున్నాడు. సూరి హత్య కేసులో భాగంగా భాను సెటిల్మెంట్లపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు మస్తాన్రావు ఆత్మహత్య వ్యవహారంపైనా దృష్టి సారించినట్లు, ఇందులో భాను ప్రమేయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.