హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మంత్రుల ప్రత్యేక బాట, సోనియాను కలవాలని నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తమ కాంగ్రెసు అధిష్ఠానం వద్ద మరోసారి తెలంగాణ డిమాండును విన్పించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు నిర్ణయించారు. తెలంగాణ మంత్రులందరూ ఒకే మాటగా తమ వాదనను విన్పించాలని, ఒకే బాటలో నడవాలని తీర్మానించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 11 మంది మంత్రులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ రెండోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం కంటే ముందే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవాలని నిర్ణయించారు. మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డీకే అరుణ, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాల్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తప్ప ఏ ఇతర అంశం కూడా తమకు ఆమోద యోగ్యం కాదని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి స్పష్టం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తెలంగాణ అంశాన్ని వివరించడం, రచ్చబండ కార్యక్రమంలో ముందుకు ఎలా వెళ్లాలి, మంత్రులందరూ కూడా ఒకే బాటలో నడవటం అన్న అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చాయి. రెండుసార్లు తెలంగాణ ప్రాంత ఎంపీలతో అధిష్ఠానం మాట్లాడిన నేపథ్యంలో మంత్రులుగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. సోనియా అపాయింట్‌మెంట్‌ కోసం అప్పటికప్పుడు వారు ప్రయత్నించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ద్వారా అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. చివరకు అపాయింట్‌మెంట్‌ బాధ్యతను మంత్రులు జానారెడ్డి, సారయ్యలకు అప్పగించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేస్తారనే వార్తలపై కూడా సమావేశంలో చర్చించారు. సమావేశం నుంచే జూపల్లితో మంత్రులు మాట్లాడారు. ఒకరిద్దరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని వారన్నట్లు తెలిసింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కలసి కట్టుగానే తీసుకుందామని నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్‌ కార్యాచరణ సమితి (క్యాఫ్ట్‌) సమావేశాలకు మంత్రులు వెళ్లనంత మాత్రాన ఉద్దేశాలను అంటగట్టడం మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. సమావేశం అనంతరం మంత్రులు బస్వరాజు సారయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్షను తెలియజేస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X