ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్ జగన్ శిబిరం రహస్య భేటీ
మైదుకూరు ఎమ్మెల్యే, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి జగన్ వర్గానికి సవాలు మీద సవాలు విసురుతున్నారు. ఈ విషయంపై కూడా వారు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ డిఎల్లతో సహా రాజీనామాకు సిద్ధమైతే మళ్లీ గెలుస్తారా లేదా అనే విషయాన్ని కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మళ్లీ గెలవలేమనే కడప జిల్లా జగన్ వర్గం ఎమ్మెల్యేలు డిఎల్ సవాలుకు వెనక్కి తగ్గినట్టుగా వార్తలు వస్తున్ననేపథ్యంలో వారు ఈ విషయాన్ని చర్చించారు. పులివెందులలో గానీ, కడపలోగానీ జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందే స్వయంగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆయనను ఎలా ఎదుర్కోవాలా అనే విషయంపై చర్చించారు.
ఉప ఎన్నికలతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత జిల్లాకు వచ్చిన నిధులు, అభివృద్ధి పనులను సమీక్షించి వాటిపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని ప్రశ్నించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించిగా తెలుస్తోంది. వైయస్ అకాల మృతి తర్వాత కడప జిల్లా అభివృద్ధికి దూరమయిందనే భావన జిల్లా ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జగన్ వర్గంలో ఉన్న వారు స్థానికంగా పట్టు ఉన్న జెడ్పీటీసులు, ఎంపీటీసీలను జగన్ వర్గంలో చేర్చే విధంగా ప్రయత్నాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.