ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి టీం వర్సెస్ వైఎస్ జగన్ క్యాంప్
నిన్నటి వరకు ఒకే పార్టీలో ఉంటూ సమర్థించుకున్న నేతలు ఇప్పుడు బద్ద శత్రువులయ్యారు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. జగన్ అవినీతిపై మీడియా మొత్తుకున్న, ప్రతిపక్షాలు గొంతెత్తి అరిచినా నిన్నటి వరకు మంచిగా కనిపించి కాంగ్రెస్కు ఇన్నాళ్లకు ఆయన అవినీతి కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపక్షాలు సభాపతిగా కిరణ్ను విమర్శిస్తే పార్టీలకతీతంగా కిరణ్ మిస్టర్ పర్ఫెక్టుగా చెప్పిన వారు నేడు ఆయన పార్శాలిటీని ప్రశ్నిస్తున్నారు.
జగన్ పార్టీనుండి బయటకు వెళ్లినప్పటికీ ఆయన వర్గంలోని వారు ఎవరూ కాంగ్రెస్ పార్టీని వీడక పోవడంతో రాష్ట్రంలో ఇప్పుడు కిరణ్ జట్టు వర్సెస్ జగన్ వర్గంగా కొనసాగుతోంది. అయితే వీరి మధ్య ఇంత ఘాటుగా చర్చ సాగుతుంటే కొందరు మౌనంగా ఉన్నవారూ ఉన్నారు. మరికొందరు అదును చూసి అడుగేసే పనిలో ఉన్నారు. కాబట్టి ఎటూ మాట్లాడకుండా సంయమనం పాటిస్తున్నారు.
అయితే మీడియాకు మంచి మసాలాలు, ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రం వీరి స్పందనలు బాగా ఉపయోగపడుతున్నాయి. జగన్ వర్గం ఏమంటుందా, దానికి కిరణ్ జట్టు ఎలా స్పందిస్తుందా అనే ఉత్సుకతతో ఇటు మీడియా, అటు ప్రజలు ఎదురు చూస్తుండటం విశేషం. రాజ్యసభ సభ్యుడు విహెచ్ మీడియా సమావేశాలలో జగన్పై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు.
జగన్ వ్యాఖ్యలపై, ఆయన వర్గం వ్యాఖ్యలపై మంత్రులు శంకర్రావు, ఆనం రామనారాయణరెడ్డి, ఒకప్పటి వైఎస్ వీరాభిమాని దానం నాగేందర్ స్పందిస్తుండగా, కిరణ్ జట్టుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, కొండా సురేఖ, గోనె ప్రకాశరావు, అప్పుడప్పుడు రోజా తదితరులు తమ మాటలతో విరుచుకు పడుతున్నారు. రాజీనామాకు సిద్ధమంటే సిద్ధమని, మీరు రాజీనామా చేయాలంటే మీరు రాజీనామా చేయాలని సవాళ్లు విసురుకుంటున్నారు. తీరా చూస్తే రాజీనామా చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో వారిది మాటల యుద్ధమే కానీ, చేతల యుద్ధం కాదని ప్రజలు ఎప్పుడో తేల్చుకున్నారు. కానీ వారు మాత్రం ఇంకా రాజీనామాల సవాళ్లు విసురుకుంటూనే ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు.
మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, కడప జిల్లా జగన్ వర్గం ఎమ్మెల్యేలు అమరనాథ్ రెడ్డి, శ్రీనివాసులు తదితరుల మధ్య సవాళ్లు మరింత ఆసక్తిని నెలకొల్పాయి. వారు ఏ నిమిషంలోనైనా రాజీనామా చేయవచ్చన్నట్టు చెలరేగాయి. డిఎల్ రాజీనామా చేస్తే మేం రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన జగన్ వర్గం ఆ తర్వాత వెనక్కి తగ్గినట్టుగానే కనిపిస్తోంది. వారి సవాల్కు డిఎల్ ఘాటుగానే స్పందించారు. ఆయన ఓ అడుగు ముందుకేసి నేను రాజీనామా పట్టుకొని స్పీకరు కార్యాలయం వద్ద ఉంటాను, మీరూ రండి అన్నట్టు ప్రతి సవాల్ చేశారు. దీంతో వారు కాస్త చల్లబడ్డట్టుగా కనిపిస్తోంది. తాము రాజీనామాలు చేస్తే ఇటు టిడిపి, అటు కాంగ్రెస్ రెండు ముక్కలు కావడంతో ఎక్కడ ఓడిపోతామో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది.