ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే?
జగన్ వైపు కనీసం 20 మంది శాసనసభ్యులుంటారని అనుకుంటే కాంగ్రెసు బలం శాసనసభలో 135కి పడిపోతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం 135 మంది శాసనసభ్యుల బలం మాత్రమే ఉందని చెప్పవచ్చు. మెజారిటీ 147 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. మైనారిటీలో పడినా కిరణ్ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని భావిస్తున్నారు. ఆ విశ్వాసంతోనే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర అనుభవంతో అధికారం చేజారిపోకుండా చూసుకునే మార్గం ఇప్పటికే సిద్ధమై ఉన్నట్లు భావిస్తున్నారు.
జగన్ వెంట వెళ్లే 20 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వానికి కావాల్సిన కనీస మెజారిటీ 137కి పడిపోతుంది. సభ వాస్తవ బలం 273 అవుతుంది. మరో ఇద్దరి సహకారంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు. అందుకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సిద్ధంగానే ఉన్నారు. చిరంజీవి వెంట మరో ఎమ్మెల్యే వచ్చినా కాంగ్రెసు ప్రభుత్వం గట్టెక్కుతుంది. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 14 మంది, మజ్లీస్ శాసనసభ్యులు ఏడుగురు మద్దతిస్తారని, దీంతో జగన్ వెంట 50 మంది వెళ్లినా ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు ఉండదని భావిస్తున్నారు.
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తెలుగుదేశం పార్టీని జగన్ వర్గం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే, తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. అదే సమయంలో జగన్కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సహకరించే పరిస్థితి లేదు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత కిరణ్ కుమార్ రెడ్డికి వరంగా మారుతోంది.